కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో నాకాబంది కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు. శనివారం రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు ఈ నాకాబందీ కార్యక్రమం ద్వారా ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. జిల్లా (Bhadradri Kothagudem) వ్యాప్తంగా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ప్రతిష్టమైన ప్రణాళికతో వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, పాత నేరస్తులను కనిపెట్టడానికి ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడం, రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను చేపట్టామన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలని జిల్లా ప్రజలను ఎస్పీ రోహిత్ రాజు కోరారు.

