కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణానికి సంబంధించిన వివాదం సోమవారం హైకోర్టులో విచారణకు రానున్నది. భద్రాచలంలో కొలువై ఉన్నది దశరథుని కుమారుడా? లేదా వైకుంఠం నుంచి నేరుగా దిగివచ్చిన వైకుంఠ రామనారాయణుడా? అనే సందిగ్ధతకు నేడు తెర పడనుంది. ఈ వివాదానికి సంబంధించి మొదటిసారిగా 2022లో హైకోర్టులో కేసు నమోదు అయింది. దీంతో న్యాయస్థానం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ 2024లో దేవాదాయ శాఖకు నివేదికను సమర్పించింది. అయితే ఈ నివేదికను ప్రభుత్వం బయట పెట్టడం లేదంటూ కంచర్ల వెంకట రమణ అనే వ్యక్తి మళ్లీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన కోర్టు ఇటీవల దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ నేడు జరగనుంది. మరో నాలుగు రోజులలో శ్రీ రామనవమి వేడుకలకు సిద్ధమవుతున్న భద్రాచల పుణ్యక్షేత్రం, ఈ వివాదం కారణంగా వార్తల్లో నిలవడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

