కలం/ఖమ్మం బ్యూరో : కమ్యూనిస్టులతోనే ప్రజలకు మెరుగైన రాజకీయాలు అందుతాయని ప్రొ.నాగేశ్వర్ అన్నారు. సిపిఐ తరఫున కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు పాల్వంచ సుగుణ గార్డెన్స్ లో శిక్షణా తరగతుల్లో భాగంగా.. రెండోరోజు శనివారం నాగేశ్వర్ హాజరై మాట్లాడారు. ప్రజా ప్రతినిధులుగా కమ్యూనిస్టుల పాత్ర అనే అంశంపై మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పాటుపడాలని, అప్పుడే వారికి ప్రజల నుండి ఆదరణ అందుతుందన్నారు.
యుపిఏ-1 ప్రభుత్వంలో కమ్యూనిస్టులు కలిసి ఉన్నప్పుడు ఉపాధిహామీ చట్టం, సమాచార హక్కు చట్టం, అటవీహక్కుల చట్టం లాంటివి ప్రజలకు ఉపయోగపడేవి అమల్లోకి వచ్చాయన్నారు. కానీ యుపీఏ-2 ప్రభుత్వం నుంచి కమ్యూనిస్టులు వై దొలగినప్పుడు అన్నీ కుంభకోణాలో జరిగాయని నాగేశ్వర్ వెల్లడించారు. కమ్యూనిస్టు ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ పేదల పక్షన పోరాడుతారని చెప్పుకొచ్చారు.
గ్రామాల్లో పట్టణాల్లో మౌళిక సదుపాయాలకల్పన.. తాగునీటి సమస్య పరిష్కారం, రహదారుల నిర్మాణం, విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని నాగేశ్వర్ చెప్పుకొచ్చారు. ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నిజమైన అర్హులకు చేరేలా పర్యవేక్షించడం, అవినీతి, అక్రమాలను అరికట్టేందుకు కృషి చేయడం కూడా ప్రజాప్రతినిధుల బాధ్యతే అన్నారు.
సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యాలతో కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు ఎప్పటికీ ప్రజల పక్షాన నిలబడి పనిచేయాలని నాగేశ్వరర్ సూచించారు. ప్రజా నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలకు మేలు చేసే దిశగా ముందుకు సాగుతూ కమ్యూనిస్టు ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉండాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి, సర్పంచ్ సృజన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, తదితరులు పాల్గొన్నారు.

