కలం, స్పోర్ట్స్: భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అరంగేట్రం ఆలస్యం కావడంపై వస్తున్న విమర్శలకు బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికీ సరైన సమయంలోనే అవకాశం దక్కుతుందని, బోర్డు ఎవరికీ అన్యాయం చేయదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆదివారం స్పష్టం చేశారు.
ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో 15 ఏళ్ల 99 రోజుల వయసులోనే వైభవ్ అరంగేట్రం చేసి, సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైభవ్కు అభినందనలు తెలిపిన శుక్లా, సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ కామెంట్లను పూర్తిగా తోసిపుచ్చారు.
సరైన సమయం వచ్చినప్పుడు..
వైభవ్కు జట్టులో చోటు ఇవ్వడం లేదంటూ సోషల్ మీడియాలో కెప్టెన్, కోచ్లపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన రాజీవ్ శుక్లా, సరైన సమయం వచ్చినప్పుడు కచ్చితంగా అవకాశం వస్తుందని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు.
టీమ్ మేనేజ్మెంట్ సరైన సమయంలోనే చాలా మంచి నిర్ణయం తీసుకుందని, దీనిని అందరూ అభినందించాలని కోరారు. వైభవ్ భవిష్యత్తులో మరింత బాగా రాణించి, జట్టులో తన స్థానాన్ని స్థిరపరుచుకుంటాడనే నమ్మకాన్ని రాజీవ్ శుక్లా వ్యక్తం చేశారు.
సచిన్ రికార్డులు బద్దలు కొట్టి..
ఈ మ్యాచ్లో వైభవ్ రెండు సిక్సర్లతో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో అతను సచిన్ టెండూల్కర్ రికార్డులను బద్దలు కొట్టి, అత్యంత పిన్న వయస్కుడైన భారత అంతర్జాతీయ క్రికెటర్గా నిలిచాడు.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (49), అభిషేక్ శర్మ (43) రాణించారు. అనంతరం ఇంగ్లాండ్ జట్టు జాకబ్ బెథెల్ (76 నాటౌట్) ధాటికి 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ప్రస్తుతం ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.

