కలం, దమ్మ పేట: సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తూ.. గుర్తు తెలియని మహిళ మృతదేహానికి గౌతమ బుద్ధ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నెల ఒకటో తేదీన దమ్మపేట (Dammapeta) మండలం జమేదార్ బంజర అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు అశ్వారావుపేటలోని ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఎవరూ రాకపోవడంతో..
ఆమె తరఫు బంధువులు ఎవరూ రాకపోవడంతో, పోలీసులు అనాథ శవంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో అంత్యక్రియల కోసం మందలపల్లికి చెందిన గౌతమ బుద్ధ స్వచ్ఛంద సేవా సంస్థ సహయం కోరారు. పోలీసుల విజ్ఞప్తికి తక్షణమే స్పందించిన సంస్థ నిర్వాహకులు, మందలపల్లి పంచాయతీ కార్యదర్శి, పోలీసుల సమక్షంలో సోమవారం మహిళ మృతదేహానికి అంత్యక్రియలు జరిపించారు.

