కలం, స్పోర్ట్స్ : ఇంగ్లండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) సిరీస్కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఆల్రౌండర్ శివమ్ దుబేను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జట్టులోకి తీసుకుంది. నితీశ్ ఎడమ కాలి క్వాడ్రిసెప్స్ గాయంతో ఇప్పటికే జరుగుతున్న టీ20 సిరీస్కు దూరంగా ఉన్నాడు. అదే గాయం కారణంగా ఇప్పుడు వన్డే సిరీస్లో కూడా ఆడలేకపోతున్నాడు. గత నెల ధర్మశాలలో అఫ్గానిస్థాన్తో జరిగిన తొలి వన్డేలో అతనికి ఈ గాయం అయింది.
దీంతో రెండో వన్డేకు విశ్రాంతి ఇచ్చారు. చెన్నైలో జరిగిన మూడో వన్డేలో తిరిగి బరిలోకి దిగినా గాయం మరింత తీవ్రంగా మారింది. దీంతో శివమ్ దుబేకు మళ్లీ వన్డే జట్టులో అవకాశం లభించింది. అతను చివరిసారిగా 2024 ఆగస్టులో శ్రీలంకతో జరిగిన వన్డేలో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు నాలుగు వన్డేలు ఆడిన దుబే 43 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ కూడా తీశాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ జూలై 14న బర్మింగ్హామ్లో ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్ జూలై 16న కార్డిఫ్లో, మూడో వన్డే జూలై 19న లండన్లో జరగనుంది.
మరోవైపు హార్దిక్ పాండ్యా కూడా అందుబాటులో లేకపోవడంతో భారత జట్టుకు మరో సమస్య ఎదురైంది. ఐపీఎల్ 2026 తర్వాత హార్దిక్ పోటీ క్రికెట్ ఆడలేదు. తొలుత వెన్నునొప్పితో ఇబ్బంది పడిన అతడు ప్రస్తుతం క్వాడ్రిసెప్స్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. జూన్ 16 నుంచి తేలికపాటి శిక్షణ ప్రారంభించినప్పటికీ, అతను ఎప్పుడు జట్టులోకి వస్తాడనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. దీంతో ఇంగ్లండ్ వన్డే సిరీస్లో భారత్కు సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ల కొరత స్పష్టంగా కనిపించనుంది.

