కలం, ఖమ్మం బ్యూరో: రాబోయే గోదావరి పుష్కరాలను (Godavari Pushkaralu) అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. భద్రాచలం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. సోమవారం భద్రాచలంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇద్దరు మీడియాతో మాట్లాడారు.
మౌలిక వసతుల కల్పనకు నిధులు..
నియోజకవర్గ పరిధిలోని పలు పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎంపీ, ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయించి పనులు ప్రారంభించనున్నట్లు వివరించారు.
క్యాంప్ ఆఫీసులో అందుబాటులో..
భద్రాచలం పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు, స్థానిక ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. నియోజకవర్గంలోని రహదారుల మరమ్మతులు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థల ఆధునీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీగా నిధులు రాబట్టేందుకు సంయుక్తంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. క్యాంప్ ఆఫీస్ వేదికగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

