కలం, వెబ్ డెస్క్: ఐదు రాష్ట్రాల తాజా ఎన్నికల ఫలితాలపై కేంద్రం హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లోనూ మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్లు రాబోతున్నాయని వ్యాఖ్యానించారు. ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించిన సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులాంటివని విమర్శించారు. పశ్చిమబెంగాల్లో ఎన్నో అరాచకాలు జరిగాయని.. బంగ్లా చొరబాటుదారులకు దారులు మూసుకుపోయాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశం అంతా బీజేపీని కోరుకుంటోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత నేత రాహుల్ గాంధీ ప్రధాని కావాలని సీఎం రేవంత్ రెడ్డి కలలు కంటున్నాడని.. సీఎం ఎక్కడికి వెళ్తే అక్కడ కాంగ్రెస్ ఓటమి పాలైందని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ రావాలని అక్కడి ప్రజలు కోరుకున్నారని తెలిపారు. బీజేపీకి అసలు ప్రచారకర్త రాహుల్ గాంధీయేనని ఎద్దేవా చేశారు. కరీంనగర్ పట్టణంలోని జ్యోతినగర్ పీఎంజే జ్యువెల్లరీ దుకాణంలో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను బండి సంజయ్ పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్సను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పాల్సింది పోయి, ఈ ఘటనను రాజకీయ కోణంలో చూస్తున్నారని మండిపడ్డారు. జువెల్లరీ షాప్ యాజమాన్యంతో మాట్లాడానని తెలిపారు.

