కలం, వెబ్డెస్క్: రాష్ట్రంలో వర్సిటీలు, విద్యాలయాల భూముల్ని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉద్ధేశించిన భూములను అమ్ముకోవడం తగదన్నారు. హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (Maulana Azad National Urdu University) భూముల వినియోగంపై వర్సిటీకి నోటీసులు జారీ చేయడాన్ని ప్రశ్నిస్తూ బుధవారం ‘ఎక్స్’ వేదికగా బండి సంజయ్ స్పందించారు. విద్యాలయాల భూముల జోలికి రావడం ప్రభుత్వానికి రెడ్ లైన్ లాంటిదని, వెనక్కి తగ్గకపోతే విద్యార్థులతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతానని హెచ్చరించారు. ‘ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూముల వినియోగంపై ఆ వర్సిటీకి నోటీసులు పంపడం ఏంటి? వేల కోట్ల విలువైన ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి, అమ్ముకోవడానికి ఇది మొదటి అడుగు కాదా? చదువుకు కనీస ప్రాథమిక సౌకర్యాలు కల్పించలేని ఈ ప్రభుత్వం.. విద్య కోసం గతంలో చేసిన భూ కేటాయింపులను ప్రశ్నిస్తోందా?’ అని ఆయన అన్నారు.
ఒవైసీ మీద చర్యలేవీ?
రాష్ట్రవ్యాప్తంగా ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకొని ప్రజాప్రయోజనాలకు ఎందుకు ఉపయోగించడం లేదని ప్రభుత్వాన్ని బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సలకం చెరువును ఆక్రమించి, విద్యను వ్యాపారంగా మార్చిన ఒవైసీ మీద చర్యలెందుకు లేవు? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయ భూములను స్వాధీనం చేసుకునే ఏ నిర్ణయాన్ని అయినా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే, విద్యార్థులతో కలసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Read Also: సిరిసిల్లలో గులాబీకి గుబులు
Follow Us On: Youtube


