కలం, వెబ్ డెస్క్: చట్టం మీద గౌరవంతో తన కుమారుడిని పోలీసులకు స్వయంగా అప్పగించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ఇలా చేసిన ఏకైక నాయకుడు కూడా తానేనని స్పష్టం చేశారు. ఇటీవల పరిణామాల తరువాత, తొలిసారి నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీపై ప్రేమ ఉన్న వ్యక్తిని అని.. తుది శ్వాస విడిచాక భౌతిక దేహంపై బీజేపీ జెండా కప్పాలనే చివరి కోరిక ఉన్న ఎంతో మంది అభిమానుల్లో నేను ఒకడిని అంటూ ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. కొత్త పార్టీ పెడుతారా.. అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పారు.
‘అన్నీ కోర్టులోనే తేలుతాయి..’
బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో తనను అరెస్ట్ చేస్తారనే విషయంపై ఇప్పుడేమీ మాట్లాడబోనని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని.. అన్నీ కోర్టులోనే తేలుతాయన్నారు. కేసీఆర్ కొడుకు మాదిరి తాను ఫేక్ మీడియా సంస్థలు నడిపి దుష్ప్రచారం చేయబోనన్నారు. వాళ్ల గడీలు బద్దలు కొట్టినందుకే, ఫ్రస్టేషన్తో ఏదో ఏదో చేస్తుంటారని.. అవన్నీ పట్టించుకోమన్నారు. కేసీఆర్ దగ్గర 17 మంది ఎంపీలు ఉన్నారా?… ఆయన దయాదాక్షిణ్యాలతో మోదీ ప్రభుత్వం నడుస్తున్నదా?.. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు కదా.. అని ఎద్దేవా చేశారు.

