కలం, తెలంగాణ బ్యూరో : పేట్బషీరాబాద్ పోలీసు స్టేషన్లో నమోదైన ఒక పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) పేరును మీడియా సంస్థలు, సోషల్ మీడియా అకౌంట్లు వినియోగించడాన్ని సవాలు చేస్తూ సిటీ సివిల్ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. బండి భగీరథ్ నిందితుడిగా ఉన్న ఈ కేసులో తండ్రిగా తన పేరును ప్రస్తావించడంతో ప్రతిష్టకు భంగం కలుగుతున్నదని, ఇకపైన తన పేరు వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సిటీ సివిల్ కోర్టును కోరారు. తన పేరుతో మీడియాలో లేదా సోషల్ మీడియాలో వార్తలు రాకుండా చూడాలని రిక్వెస్టు చేశారు. ఇప్పటివరకు ప్రచురితమైన, ప్రసారమైన కంటెంట్ను, లింకులను తొలగించాలని కూడా కోరారు.
ఈ పిటిషన్ను విచారణకు తీసుకున్న సిటీ సివిల్ కోర్టు ‘గ్యాగ్’ ఆర్డర్ను జారీచేసింది. బండి భగీరథ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ లక్ష్యంగా కొనసాగిస్తున్న దుష్ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని ఆ ఆర్డర్లో స్పష్టం చేసింది. ఇప్పటిదాకా బండి సంజయ్ను టార్గెట్ చేస్తూ ప్రసారం చేసిన వీడియో క్లిప్పింగులను, పత్రికా క్లిప్పింగులను, డిజిటల్ కంటెంట్ను, పోస్టర్లను సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించాలని ఆదేశించింది. ఈ నెల 26లోపు ఆయా వీడియో క్లిప్పింగులను, డిజిటల్, పత్రికా కథనాలను, పోస్టర్లను తొలగించకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇకపై బండి సంజయ్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించింది.

