కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ లో ఈనెల 12న నిర్వహించే ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిద్దామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు, జన సమీకరణపై జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో గాయత్రీనగర్, జ్యోతినగర్ లోని ఫంక్షన్ హాళ్లల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ తరలివచ్చి హిందూ సంఘటిత శక్తిని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రధాన మీడియా, సోషల్ మీడియా వేదికగా భారీగా ప్రచారం నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. పార్టీ నాయకులంతా తమ తమ వార్డులు, గ్రామ, మండలాల్లో ఇంటింటికీ వెళ్లి వినూత్న రీతిలో బొట్టు పెట్టి ఏక్తా యాత్రకు రావాలని ప్రజలను ఆహ్వానించాలన్నారు.
యువకులకు అవకాశం ఇద్దాం..
బండి సంజయ్ మాట్లాడుతూ.. కరీంనగర్లోని వైశ్యా భవన్ నుంచి సాయంత్రం 4 గంటలకు యాత్ర ప్రారంభమవుతుందన్నారు. మండలాల నుంచి అధిక సంఖ్యలో తరలిస్తే వారంతా హిందుత్వం కోసం పనిచేసే యువకులుగా మారే అవకాశమిద్దామన్నారు. ప్రతి వార్డులో, డివిజన్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని.. వాల్ రైటింగ్ రాయించాలన్నారు. రేపటి నుండే మండలాలు, గ్రామాల, పోలింగ్ బూత్ల వారీగా మీటింగ్ నిర్వహించాలన్నారు. పార్టీ సీనియర్ నేతలు బాస సత్యనారాయణ, డి.శంకర్, కోమాల ఆంజనేయులు, గుగ్గిళ్ల రమేశ్, నల్లాల ఒదేలు తదితరులు పాల్గొన్నారు.

