కలం, వెబ్ డెస్క్: కరీంనగర్ పీఎంజే జ్యూవెలర్స్లో జరిగిన దారుణ కాల్పుల ఘటన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్ నగర నడిబొడ్డునే గన్ కల్చర్ పెరగడం, నేరస్తులు రెచ్చిపోవడం ప్రభుత్వ పాలన పూర్తిగా చేతులెత్తేసిందనే దానికి స్పష్టమైన నిదర్శనమని మండిపడ్డారు. కరీంనగర్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 700 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను బలోపేతం చేసిందని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడం వల్ల పరిస్థితి అదుపు తప్పిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సమయంలో ఇంటర్సెప్టర్ విధానం ద్వారా ప్రతి చౌరస్తాలో హోమ్ గార్డ్, కానిస్టేబుల్, ASIలను నియమించి శాంతి భద్రతలు కాపాడేవారని గుర్తుచేశారు.
ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని మండిపడ్డారు. గాయపడిన బాధితులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.కోటి ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు.గాయపడిన నలుగురి బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకోవాలన్నారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నగర పోలీస్ కమిషనర్ను తక్షణమే సస్పెండ్ చేయాలని, కాల్పులకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు.

