కలం, వెబ్ డెస్క్: పారాక్వాట్ డైక్లోరైడ్ (గడ్డి మందు) అనేది ఆత్మహత్యలకు ప్రధాన సాధనంగా మారుతుండడం కల్లోలం సష్టిస్తోంది. చిన్నపాటి మనస్పర్థలు లేదా క్షణికావేశంలో ఈ రసాయనాన్ని సేవించిన వారు ప్రాణాలు కోల్పోతున్నారు. గడ్డి మందు ను సేవించిన సందర్భాల్లో మరణాల రేటు దాదాపు 100 శాతం ఉండటం అత్యంత భయానకమైన విషయం. ఇవాళ టాలీవుడ్ విలక్షణ నటుడు రాహుల్ రామకృష్ణ సోదరుడు సైతం గడ్డి మందు తాగి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రాణాంతక రసాయనాన్ని వెంటనే నిషేధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో గడ్డిమందు నిషేధ అంశం ఇప్పుడు పార్లమెంట్ కు కూడా పాకింది. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య (MP Kavya) లోక్సభలో పారాక్వాట్ డైక్లోరైడ్ (గడ్డి మందు)పై పూర్తి నిషేధం (Ban Paraquat Herbicide) విధించాలని డిమాండ్ చేశారు.
పారాక్వాట్ డైక్లోరైడ్ కేవలం కలుపు మొక్కలను నివారించే రసాయనం మాత్రమే కాదని, ఇది నేల, నీరు, గాలిని తీవ్రంగా కలుషితం చేస్తోందని ఎంపీ తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడ్డి మందు ఆత్మహత్యలకు ప్రధాన సాధనంగా మారిందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు వరంగల్ సహా తెలంగాణలోని అనేక జిల్లాల్లో పారాక్వాట్ వల్ల జరుగుతున్న ప్రాణనష్టాన్ని ఎంపీ వివరించారు. దీనికి ఇప్పటివరకు ఎటువంటి విరుగుడు అందుబాటులో లేకపోవడం వల్ల ఆసుపత్రికి చేరినా ప్రాణాలు కాపాడటం అసాధ్యంగా మారుతుందన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటం కంటే వేరే ఏదీ ముఖ్యం కాదని, అందుకే కేంద్ర ప్రభుత్వం తక్షణమే దీని తయారీ, అమ్మకాలు , వినియోగంపై సంపూర్ణ నిషేధం విధించాలన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA), పలువురు వైద్య నిపుణులు కూడా ఈ రసాయానాన్ని పూర్తిగా నిషేధించాలని గళమెత్తారని గుర్తుచేశారు. ప్రమాదకరమైన ఇటువంటి రసాయనాలకు బదులుగా పర్యావరణహితమైన, సురక్షితమైన ప్రత్యామ్నాయాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించాలని ఎంపీ కావ్య (MP Kavya) కోరారు.
Read Also: ‘ఇక్కత్’ రంగుల వెనుక నేతన్నల కన్నీటి వ్యథ
Follow Us On : WhatsApp

