కలం, వెబ్ డెస్క్: శ్రీనగర్ (Srinagar)-లేహ్ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన వరుస హిమపాతాల (Avalanches) వల్ల భారీ ప్రాణనష్టం సంభవించింది. జీరో పాయింట్, మినిమార్గ్ మధ్య ఉన్న రహదారిపై ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడటంతో సుమారు డజను వాహనాలు మంచు కింద కూరుకుపోయాయి. ఈ ప్రమాదంలో కనీసం ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే, సహాయక చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు.
ఈ ఘటనపై లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జోజిలా పాస్ వద్ద జరిగిన సంఘటనను పర్యవేక్షిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. తక్షణమే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కార్గిల్ జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. విపత్తు నిర్వహణ దళాలు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) అధికారులను హై అలర్ట్లో ఉంచినట్లు ఆయన వెల్లడించారు.

