కలం, వెబ్ డెస్క్: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తాను కొత్త పార్టీపై కీలక అప్ డేట్ ఇస్తున్నట్లు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) తెలపడం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీస్తుంది. తాను ముహుర్తాలను నమ్ముతానని అందుకే శ్రీరామనవమి రోజు పార్టీ ప్రకటన చేస్తున్నానని ఆమె వ్యాఖ్యానించడంపై కొందరు కొత్త వాదానలను తెరపైకి తీసుకొస్తున్నారు. అసలు జ్యోతిషశాస్త్రం ప్రకారం నవమి రోజున .. కొత్త పనులు ప్రారంభించడానికి అంత మంచిది కాదని, మరి ముహుర్తాలను నమ్మే కవిత తన కొత్త పార్టీ ప్రకటన చేయడానికి వెనుక ఉన్న మతలబు ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.
నిజానికి శ్రీరామ నవమి వంటి పవిత్రమైన రోజున పూజలు, ఆధ్యాత్మిక పనులు చేయడానికి మాత్రమే నవమి తిథి మంచిదని పండితులు చెబుతున్నారు. అయితే కొత్త పనులు ప్రారంభించడానికి దశమి తిథి ఉత్తమమైనదని అంటున్నారు. ఇదే విషయాన్ని కవిత పాటించారని తెలుపుతున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. నమమి తిథి 2026 మార్చి 26 ఉదయం 11:48 గంటలకు ప్రారంభమై, మార్చి 27 ఉదయం 10:06 గంటలకు ముగిసిందని పేర్కొంటున్నారు. ఆ తర్వాత దశమి తిథి ప్రారంభం అయిందని..దానికి అనుగుణంగానే తన పార్టీకి సంబంధించిన కీలక అప్ డేట్ ను కవిత ఇచ్చినట్లు వెల్లడిస్తున్నారు.
అంతేకాదు ఇవాళ అమృతఘడియలు మధ్యాహ్నం 1:44 నుండి మధ్యాహ్నం 3:16 గంటల వరకు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమయంలో చేసే కార్యాలకు రెట్టింపు లాభం చేకూరుతుందని.. అందుకే అమె తన ప్రసంగాన్ని మధ్యాహ్నం 3:16 కు ముగించారని వివరిస్తున్నారు. ఆ సమయంలోనే ఈ ఏడాది ఏప్రిల్ 25న అధికారికంగా పార్టీ పేరు, జెండా, ఎజెండా, విధివిధానాలు ప్రకటించబోతున్నట్లు ఆమె ప్రకటించినట్లు స్పష్టం చేస్తున్నారు. ఆమె పార్టీ ప్రకటనలో ఆంతర్యం ఇదేనని పేర్కొంటున్నారు. ఈ విషయం తెలిసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) రాజకీయ నిర్ణయాలు, పార్టీ కార్యక్రమాలను పవిత్రమైన ముహూర్తాల ప్రకారం చేపడతారనే విషయం తెలిసిందే. ఇప్పుడు తండ్రి బాటాలోనే పయనిస్తూ ముహూర్తాల ప్రకారం తన రాజకీయ పార్టీని బరిలో దింపుతున్న కవిత పొలిటికల్ కెరీర్ ఎలా ఉంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.

