హిమంత బిశ్వా రాజీనామా.. ముఖ్యమంత్రి ఎవరనేదానిపై సస్పెన్స్!

కలం, వెబ్ డెస్క్: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma ) బుధవారం తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు అందజేశారు. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న రనోజ్ పెగు, లఖింపూర్ ఎమ్మెల్యే మానబ్ డెకాతో కలిసి ఆయన లోక్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. అనంతరం హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడారు. ‘‘నా రాజీనామాను గవర్నర్‌కు ఇచ్చేశాను. ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేయాలని కోరాను. ఆయన నా విన్నపాన్ని అంగీకరించారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆపద్ధర్మ ప్రభుత్వ అధిపతిగా కొనసాగాలని నన్ను కోరారు’’ అని హిమంత బిశ్వ శర్మ తెలిపారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు త్వరలోనే సమావేశమై శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకుంటారని వెల్లడించారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత బీజేపీ, మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్ (ఏజీపీ), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) ప్రతినిధులు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు హక్కును కోరనున్నట్లు తెలిపారు.

అసోంలో చారిత్రాత్మక విజయం

బీజేపీ, మిత్రపక్షాలకు చారిత్రాత్మక విజయమని హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma ) అన్నారు. ‘‘కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ (Modi) హాజరు కావాలని మేము కోరుకుంటున్నాం. అయితే మే 11 వరకు ప్రధాని బిజీగా ఉన్నారని మాకు సమాచారం అందింది. అందుకే ఆ తేదీ తర్వాతే కార్యక్రమం ఉంటుంది” అని శర్మ వివరించారు. గువహటిలోని ఖానాపరాలో జరగనున్న ఈ వేడుకకు ప్రధానితో పాటు ఈశాన్య రాష్ట్రాల సీఎంలు కూడా హాజరుకానున్నారు.

మే 12 తర్వాత ప్రమాణ స్వీకారం?

కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవం ఎప్పుడు జరుగుతుందనే దానిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, మే 12న ఉండొచ్చని బీజేపీ వర్గాలు సూచిస్తున్నాయి. శనివారం బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ కార్యక్రమం ఉంటుందని తెలుస్తున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>