కలం, ఖమ్మం బ్యూరో : రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా ఖమ్మం (Khammam) జిల్లా వి.ఎం.బంజర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తరచూ జరిగే రోడ్డు ప్రమాద హాట్ స్పాట్లను ఎన్హెచ్ఏఐ అధికారులతో కలసి కల్లూరు (Kalluru) ఏసీపీ వసుంధర యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏసీపీ రింగ్ సెంటర్లో వేసిన రంబుల్ స్ట్రిప్స్ను పరిశీలించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే వైపు వెళ్లే వాహనాల వేగాన్ని నియంత్రించడానికి సర్వీస్ రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు వేయాలని సూచించారు. రోడ్లు స్పష్టంగా కనిపించే విధంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల పొదలను తొలగించాలని సూచించారు.
అనంతరం “అరైవ్ అలైవ్ క్యాంపెయిన్” 3వ దశలో భాగంగా హెల్మెట్ వాడకం, రహదారి భద్రతా నిబంధనలను పాటించడంపై వి.ఎం.బంజర్ రింగ్ సెంటర్లో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఆటో యూనియన్ సభ్యులు, దుకాణదారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతి వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి జాగ్రత్తగా వాహనం నడపడం చాలా ముఖ్యమన్నారు. కుటుంబాలు క్షేమంగా ఉండాలనే లక్ష్యంతో చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా వాహనం తీసుకొని రోడ్డెక్కుతున్న ప్రతి వ్యక్తి సురక్షితంగా వాహనం నడిపి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని, అందుకోసం విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, కల్లూరు (Kalluru) డివిజన్ లో వివిధ పోలీస్ స్టేషన్లు ఇతర శాఖలతో కలిసి ‘అరైవ్ అలైవ్’ కాన్సెప్ట్ పై అవగాహన కల్పిస్తూ సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం, గుంతలను పూడ్చడం, చెత్తాచెదారాన్ని తొలగించడం వంటి కార్యక్రమాలు చేపడుతూ స్థానికుల్లో ఉత్సాహం నింపారు.
Read Also: ఆక్రమణకు దిగితే నరికేస్తాం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
Follow Us On: Instagram

