కలం, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో అనుమానాస్పద డ్రోన్ (Suspicious Drone) కలకలం రేపింది. అంతర్జాతీయ సరిహద్దులో పాక్ నుంచి వచ్చిన ఓ డ్రోన్ ఆయుధాలతో పాటు డ్రగ్స్ కూడా తీసుకెళ్తున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపినా.. తప్పించుకుని క్షణాల్లో మాయమైంది. దీంతో, సరిహద్దు వెంబడి హై అలర్ట్ ప్రకటించి.. డ్రోన్ జాడ కోసం వెతుకులాట ప్రారంభించారు.
మళ్లీ దాడులకు కుట్రలు..
పహల్గాం ఉగ్ర దాడి తరువాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో చావు దెబ్బ తిన్న పాకిస్థాన్.. ఎప్పటిలాగే ఇండియాపైకి ముష్కరులను ఎగదోసే కార్యక్రమం చేపట్టినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే, రెండు రోజుల కిందట ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్థాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కాలంలో జమ్మూలోని పలు ప్రాంతాల్లో అనుమానాస్పద డ్రోన్ల సంచారం పెరగడంతో భద్రతా బలగాలు కూంబింగ్ మరింత పెంచాయి.

