కలం, స్పోర్ట్స్ : వరల్డ్ కప్లో(FIFA World Cup 2026) ఈజిప్ట్తో (Egypt) జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో అర్జెంటీనా (Argentina) అద్భుత విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. చివరి నిమిషాలలో అద్భుతంగా పుంజుకున్న డిఫెండింగ్ ఛాంపియన్ 3-2 తేడాతో విజయం సాధించి అభిమానులను ఉర్రూతలూగించింది. మ్యాచ్లో ఒక దశలో అర్జెంటీనా 0-2తో వెనుకబడింది. ఆట ముగియడానికి మరో 11 నిమిషాలు మాత్రమే మిగిలి ఉండటంతో జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందని అంతా భావించారు. అలాంటి క్లిష్ట సమయంలో క్రిస్టియన్ రొమేరో హెడర్తో తొలి గోల్ చేయగా, నాలుగు నిమిషాల తర్వాత కెప్టెన్ లియోనెల్ మెస్సి సమీకరణ గోల్ నమోదు చేశాడు. ఇక ఇంజరీ టైమ్ 93వ నిమిషంలో ఎంజో ఫెర్నాండెజ్ అద్భుత హెడర్తో విజయం అర్జెంటీనా ఖాతాలో పడింది.
ఈ విజయంతో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన హెడ్ కోచ్ లియోనెల్ స్కలోని (Lionel Scaloni) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేక ఇంటర్వ్యూను మధ్యలోనే ఆపివేసి వెళ్లిపోయారు. తర్వాత స్పందించిన స్కలోని.. ఈ మ్యాచ్ తనపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చిందని, ఫుట్బాల్లో ఇలాంటి క్షణాలే జీవితాంతం గుర్తుండిపోతాయని అన్నారు. తన ఎమోషన్స్ చూసి జట్టులోని ఆటగాళ్లు సరదాగా తనను ‘క్రైబేబీ’ అని పిలుస్తుంటారని నవ్వుతూ చెప్పారు. ఆటగాళ్ల పోరాటస్ఫూర్తే ఈ అద్భుత విజయానికి కారణమని ఆయన ప్రశంసించారు.
Read Also: రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్కు అదిరిపోయే టైటిల్?
Follow Us On : WhatsApp

