NTR Vaidya Seva – Aarogyasri Services | ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఓపీతో పాటు ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆశ) ప్రకటించింది. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు తమకు ప్రభుత్వం నుంచి రూ.2,700 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, వాటి వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని ఆశ పేర్కొంది. తమ బకాయిలను త్వరితగతిన చెల్లించాలని, అంతేకాకుండా ప్రతినెల ఆరోగ్యశ్రీకి రూ.800 కోట్లు బిల్లుల చెల్లింపులను రెగ్యులర్ చేయాలంటూ పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. అయితే ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోవడం ఇది రెండోసారి. గతంలో కూడా ఇదే అంశంపై ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు అధికారికంగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి.
NTR Vaidya Seva పై ఆశ డిమాండ్లు ఇవే..
గతంలో సీఈవో ఆమోదించిన బిల్లులు 550 కోట్ల రూపాయలు చెల్లించాలి..
ఈ నెల నుంచి నెలకు రూ.800 కోట్లు చొప్పున బిల్లుల చెల్లింపుకు ఏర్పాటు చేసి రెగ్యులర్ చేయాలి..
రూ.2,700 కోట్ల వరకు బకాయిలు ఉండటంతో ఇబ్బందికరంగా మారింది..
యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రారంభించే లోపుగా మిగిలిన బిల్లుల చెల్లింపుకు రోడ్ మ్యాప్ ఇవ్వాలి..
ఎన్టీఆర్ వైద్యసేవ(NTR Vaidya Seva) ప్యాకేజీల రేట్లు ద్రవ్యోల్బణం ఆధారంగా పెంచాలి..
కేంద్ర ప్రతిపాదిత ఆరోగ్యసేవా స్కీమ్లతో సమానంగా ప్యాకేజీ రేట్లు ఉండాలి..
ఎన్టీఆర్ వైద్యసేవా స్కీమ్ ప్యాకేజీల రేట్లు 30 నుంచి 40 శాతం తక్కువగా ఉన్నాయి..
గ్రీవెన్స్ కమిటీల సమావేశాలు రెగ్యులర్ గా జరపాలి..
సీఈవోలను ఎక్కువగా మార్చేయడం సమాచార లోపానికి, విధానాల అమలు లోపానికి కారణం అవుతోంది..
యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అమలు నిర్ణయాలు తీసుకోవడంలో స్పెషాలిటీ ఆసుపత్రులను భాగం చేయాలి.
స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ తో చర్చించిన తరువాతే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అమలుపై నిర్ణయం తీసుకోవాలి.
Read Also: సీఎంను గంటలో చంపుతా.. పోలీసులకే వార్నింగ్

