కలం, వెబ్ డెస్క్ : ఏపీలో మున్సిపల్ (AP Municipal Elections) ఎన్నికల నిర్వహణపై కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికలను 2026 అక్టోబర్ చివరి నాటికి నిర్వహించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ మేరకు ‘మున్సిపల్ సవరణ చట్టం 2026’ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నూతన చట్ట సవరణలు ఆగస్టు 28 నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపిన ప్రభుత్వం.. ఇకపై మేయర్ , వార్డు సభ్యుల ఎన్నికలకు ప్రత్యేక ఓటింగ్ పద్దతిని వర్తింపజేయనున్నట్లు తెలిపింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎలంను వినియోగించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఓటర్లకు నోటా వినియోగించుకునే అవకాశం ఇచ్చినట్లు వెల్లడించింది. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ డిపాజిట్లను కూటమి ప్రభుత్వం ఖరారు చేసింది. జనరల్ కేటగిరి అభ్యర్థులకు రూ. 5000గా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ. 2000 డిపాజిట్ చేయాలని వెల్లడించింది. అటు నామినేషన్ వేసే అభ్యర్థి తప్పనిసరిగా నేర చరిత్ర, ఆస్తులు, అప్పుల వివరాలతో పాటు విద్య అర్హతలకు సంబంధించిన నోటరీ చేసిన అఫిడవిట్ను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

