కలం, వెబ్డెస్క్: ఏపీ (AP) వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించి. పర్యావరణ సమతుల్యతను కాపాడటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరికొత్త హరిత సమరానికి శ్రీకారం చుట్టింది. డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేక చొరవతో అటవీ శాఖ ఏకంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ (Seed Balls) పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతోంది. ఇందులో భాగంగా రాబోయే జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీనిని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగానే కాకుండా ఒక ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు, పొదుపు సంఘాల మహిళలు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని అటవీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈ మహా యజ్ఞంలో భాగంగా జులై, ఆగస్టు వర్షాకాలం సీజన్లను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా సీడ్ బాల్స్ను విస్తారంగా చల్లడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందు కోసం నేరుగా చల్లడం, చేతులతో నాటడంతో పాటు కొండలు, అటవీ ప్రాంతాల్లో అత్యాధునిక డ్రోన్ల సాంకేతికతను ఉపయోగించనున్నారు. జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం, వాతావరణ మార్పులను తట్టుకొని సుస్థిర ఆంధ్రప్రదేశ్ను నిర్మించడమే ఈ హరిత ఉద్యమ ప్రధాన లక్ష్యమని అటవీ శాఖ అధికారులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. మనం చల్లే ప్రతి విత్తన బంతి మన భవిష్యత్తుకు ఇచ్చే ఒక నమ్మకమైన హామీ అని చెప్పారు. రాబోయే తరాల కోసం ఏపీని పచ్చగా, ఆరోగ్యకరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని పిలుపునిచ్చారు.

