కలం, వెబ్ డెస్క్ : అమరావతిలో గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ (AP Cabinet) సమావేశం దాదాపు నాలుగు గంటల పాటు సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక వసతులపై విస్తృత చర్చ జరిగింది. రాజకీయ పార్టీల కార్యాలయాల భూముల లీజు గడువును 66 ఏళ్లకు పెంచే అంశంపై కేబినెట్ చర్చించింది. అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసి నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న భారీ AI డేటా సెంటర్కు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కోసం 854 ఎకరాల భూమి కేటాయింపుకు కూడా కేబినెట్ పచ్చజెండా ఊపింది.
అలాగే ఓర్వకల్లో సోలార్ సెల్ తయారీ యూనిట్ ఏర్పాటు, విద్యుత్ శాఖలో 629 ఏఈఈ పోస్టుల భర్తీపై చర్చ జరిగింది. తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ భారీ ప్లాంట్ ఏర్పాటు అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు భారీ నిధులు మంజూరు చేయడంతో పాటు, మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు రూ.790 కోట్లకు ఆమోదం తెలిపింది. చిత్తూరులో అపోలో టైర్స్ విస్తరణకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అగ్రిగోల్డ్ బాధితుల కేసుల వేగవంత విచారణ కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నెల్లూరులో ఎంజైమ్ తయారీ కేంద్రానికి అనుమతి ఇచ్చారు. శ్రీసత్యసాయి జిల్లాలో రిలయన్స్ మెగా సోలార్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన కేబినెట్, రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలక అడుగులు వేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

