కలం, వెబ్ డెస్క్: దేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ (Philip Green).. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ హిల్లరీ మెక్గీచీ గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)తో సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని నందినగర్లో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పరస్పర ప్రయోజనాలు, వ్యూహాత్మక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆస్ట్రేలియా పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సాంకేతిక రంగంలో పరస్పర సహకారం, విద్యారంగంలో నూతన భాగస్వామ్యాల గురించి ప్రస్తావించారు.
ఐటీ, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, ఇన్నోవేషన్ రంగాల్లో హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న అభివృద్ధిపై తెలంగాణ, ఆస్ట్రేలియా మధ్య సహకారం భవిష్యత్తులో స్థానిక యువతకు మరిన్ని అంతర్జాతీయ అవకాశాలను కల్పిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఉన్న దృఢమైన స్నేహపూర్వక బంధాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే దిశగా ఈ చర్చలు సాగినట్లు తెలిపారు. ఆస్ట్రేలియా ప్రతినిధులతో జరిగిన సమావేశం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు, సాంస్కృతిక బంధాలకు మరింత బలాన్ని చేకూరుస్తుందని అభిలషించారు.

