కలం, వెబ్ డెస్క్ : ప్రభుత్వ ఉద్యోగ నియామకాల విషయంలో ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Government) సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలలో 95 శాతం పోస్టులు స్థానికులే పొందేలా తాజాగా జీవో 45ను రిలీజ్ చేసింది. 2025 రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా ప్రభుత్వం తాజాగా ఈ జీవోను జారీ చేసింది. దీని ప్రకారం.. మొత్తం పోస్టుల్లో 95 శాతం స్థానిక అభ్యర్థులకే కేటాయించనున్నారు. మిగిలిన 5 శాతం పోస్టులు మాత్రమే ఓపెన్ కోటాలో అందరికీ అందుబాటులో ఉంచారు. స్థానికులకు పెద్ధ ఎత్తున అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానం అమలు చేస్తోంది.
వరుసగా నాలుగేళ్లు ఒక ప్రాంతంలో నివాసం ఉండటం లేదా అక్కడే చదువుకోవడం ఆధారంగా స్థానికతను ఖరారు చేయనున్నారు. అంతేకాదు ఈ జీవో ప్రకారం రాష్ట్రాన్ని మొత్తం ఆరు జోన్లు, 2 మల్టీ జోన్లుగా విభజించారు. అయితే ఆంధ్రప్రదేశ్ సచివాలయం, హెచ్వోడీ కార్యాలయాలు, రాష్ట్ర స్థాయి సంస్థలకు ఈ స్థానిక కేడర్ నిబంధనలు వర్తించవు. ఈ విభాగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మెరిట్ ఆధారంగా నియామకాలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకే పెద్దపీట వేయడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని అంటున్నారు.
Read Also: ‘నా కొడకా..’ అంటూ రేవంత్ పై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
Follow Us On: Instagram

