కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల (West Asia Crisis) వల్ల ప్రపంచం ఆహార, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, కానీ భారత్ వేగవంతమైన అభివృద్ధి వైపు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) చెప్పారు. శనివారం నోయిడాలోని జెవార్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన మోడీ (PM Modi) పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై స్పందించారు. యుద్ధాన్ని ప్రపంచం మొత్తం నిశితంగా గమనిస్తోందన్నారు. నెల రోజులుగా సాగుతున్న అనిశ్చితి ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీసిందని చెప్పారు. ఈ ఘర్షణ కారణంగా అనేక దేశాలలో నిత్యావసరాల కొరత ఏర్పడిందని.. ఆహారం, ఇంధనం, గ్యాస్, ఇతర ఆవశ్యక వస్తువుల లభ్యతపై ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచ దేశాలపై ఈ ఘర్షణ ప్రభావం తీవ్రంగా చూపిస్తోందని.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మోడీ వెల్లడించారు. యుద్ధ ప్రభావానికి భారత్ గురి కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. సంక్షోభం నుంచి దేశాన్ని రక్షించేందుకు అన్ని విధాలా కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో దేశ పౌరుల మద్ధతు, దృఢత్వంపై ఆధారపడి ఉంటుందన్నారు. సంక్షోభ సమయంలో కూడా ఎలాంటి అంతరాయం లేకుండా భారత్ ముందుకు వెళ్తున్నదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.

