కలం, వెబ్ డెస్క్ : ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం (AP Cabinet) రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ చారిత్రత్మకమైన తీర్మానం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్-5ని సవరించాలని మంత్రివర్గం తీర్మానించింది.ఈ మేరకు సీఆర్డీఏ పరిధిలోని అమరావతి పేరును కొత్త రాజధానిగా చేర్చాలని ప్రతిపాదనలు చేసింది. ఎల్లుండి (28-03-2026) ఏపీ అసెంబ్లీలో 4 గంటల పాటు రాజధాని అమరావతిపై చర్చ చేపట్టి తీర్మానించాలని నిర్ణయించింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధాని అమరావతికి ఆమోదం లభించాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో అసెంబ్లీలో చర్చ జరిగిన వెంటనే రాజధాని చట్టబద్దత బిల్లును కేంద్రానికి పంపనుంది.
అటు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, 60 మీటర్ల ఎత్తు వరకు అకడమిక్ భవనాల నిర్మాణం చేసుకునేందుకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 96 జూనియర్, సీనియర్ సివిల్ జడ్జిల కోర్టులను ఏర్పాటు చేసేందుకు అనుమతినిచ్చింది. ప్రాధాన్య క్రమంలో వడ్డెర సంఘాలకు ఖనిజాల లీజుల కేటాయింపులతో పాటు ఖనిజాలకు సంబంధించిన లీజుల కేటాయింపులో ప్రీమియం, సీనరేజ్ ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పించే నిర్ణయానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇదిలాఉంటే రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థపై కూడా కేబినెట్లో సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ లోపు రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో 2000 చొప్పున సూర్యఘర్ కనెక్షన్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో పీఎం కుసుమ్ పథకం ద్వారా పవర్ లాస్లు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని .. 33/11కేవీ సబ్ స్టేషన్ల వద్ద బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టెక్నాలజీని అందిపుచ్చుకుని ఎప్పటికప్పుడు సంస్కరణలను తీసుకొచ్చి విద్యుత్ శాఖ ముందుకెళ్లాలని సూచనలు చేశారు.

