కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండాలని సీఎం రేవంత్ (CM Revanth) వ్యాఖ్యానించారు. శానసమండలి హాల్లో ఎంఎంటీఎస్ సర్వీసులపై (MMTS Services) సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఎంఎంటీఎస్లో ప్రయాణికులు తగ్గడంపై అడిగి తీసుకున్నారు. ఆఫీసుల సమయాల్లో ఎంఎంటీఎస్ల సంఖ్య పెంచడంతో పాటు సమయ పాలన పాటిస్తూ సర్వీసులను నడపాలని ఆదేశించారు. ప్రధానంగా ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్దకు ఆర్టీసీ బస్సులు వెళ్లేందుకు అవకాశం లేకపోవడం, స్టేషన్లు లోపలికి ఉండటంతో అక్కడకు రాకపోకలు సాగించేందుకు వీలుగా మినీ బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
ఎంఎంటీఎస్ స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలన్నారు. మెరుగైన వసతులు ఉన్నప్పుడే ప్రయాణికులు ఎంఎంటీఎస్ వైపు మొగ్గు చూపుతారని తెలిపారు. స్వీయ ఆదాయ వనరులు పెంచుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంపుతో పాటు ప్రయాణికుల సంఖ్య పెంపుపై దృష్టి సారించాలన్నారు. వసతులు మెరుగుపరచడానికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (Ramakrishna Rao) తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు పాల్గొన్నారు.

