కలం, నల్లగొండ బ్యూరో : రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ వినియోగాన్ని తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (MLA Beerla Ilaiah) పేర్కొన్నారు. అతివేగం, నిర్లక్ష్యం, హెల్మెట్ లేకపోవడం వల్ల అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నామని అన్నారు. యాదగిరిగుట్ట (Yadagirigutta) మండలం సైదాపూర్ గ్రామంలో 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ‘అరైవ్.. అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ వెంకట్ రెడ్డి, బీర్ల శంకర్తో కలిసి గ్రామంలోని వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య(MLA Beerla Ilaiah) మాట్లాడుతూ, రోజురోజుకీ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత వేగానికి లోనుకాకుండా బాధ్యతగా వాహనాలు నడపాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు.
‘ప్రాణం విలువైనది.. కుటుంబానికి మీరు అవసరం’ అనే సందేశంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపడం పూర్తిగా మానుకోవాలని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగానే ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
Read Also: టైటిల్ కోసం అన్నా చెల్లెళ్ల ఫైట్.. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ
Follow Us On : WhatsApp

