కలం, కరీంనగర్ బ్యూరో : విద్యాశాఖ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్దంగా కరీంనగర్ (Karimnagar) పట్టణంలో ఎస్ బి బన్సల్, జ్యోతినగర్ లో ఎంఎస్ బన్సల్, కోర్టు సర్కిల్ లో కోటాస్ బన్సల్ గ్రావిటీ అకాడమీ పేర్లతో ఇంటర్మీడియట్ అడ్మిషన్లు చేపడుతున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐవైఎఫ్ (AIYF) రాష్ట్ర సహాయ కార్యదర్శి భావండ్లపల్లి యుగంధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కరీంనగర్ లో ప్రజావాణిలో కలెక్టర్ చిత్రమిశ్రాను కలిసి వినతి పత్రం సమర్పించారు. తప్పుడు ఫలితాలు చూపెట్టిన తదనంతరం బన్సల్ కళాశాల యజమాన్యం కరీంనగర్ జిల్లాలో బోర్డు తిప్పేయగా తిరిగి తోక పేర్లతో విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేయాటానికి తెరలేపిందన్నారు.
గతంలో ఏఐవైఏఫ్ (AIYF) ఆధ్వర్యంలో బన్సల్ కళాశాల యజమాన్యంపై పలుమార్లు జిల్లా కలెక్టర్, తదితర విద్యా అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. తద్వారా బన్సల్ కళాశాల యజమాన్యం ఆడిందే ఆటగా ఇంటర్మీడియట్ ఫలితాలు అనంతరం బోర్డు తిప్పేసి విద్యార్థుల వారి తల్లిదండ్రులకు మొండిచేయి చూపిందన్నారు. విద్యార్థుల జీవితం రోడ్డు పాలు కావటానికి కారణం విద్యాశాఖ అధికారులే కారణమని ఆరోపించారు.
ఇకనైనా డీఐఈఓ క్షేత్రస్థాయిలో జిల్లాలోని ప్రైవేటు జూనియర్ కళాశాలపై ప్రత్యేక నిఘా విభాగం ఏర్పాటు చేయాలన్నారు. ఫలితాల అనంతరం బోర్డు తిప్పేసి విద్యార్థుల జీవితాలను రోడ్డుపై వేసి మళ్ళీ తోక పేర్లతో ముందుకు వస్తున్న బన్సల్ కళాశాల యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని యుగంధర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి చంచల మురళి, పినమల్ల భాస్కర్, వినయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Read Also: కాంగ్రెస్లో కుంపటి.. ఎంపీ అరవింద్ కామెంట్లతో కొత్త చర్చ !
Follow Us On: WhatsApp

