కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ఇంధన ధరల ప్రభావం విమానయాన రంగంపై కూడా పడుతోంది. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా (Air India) సంచలన నిర్ణయం తీసుకుంది. రోజువారీగా 100 విమాన సర్వీసులను తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు భారీగా పెరగడంతో జూన్ నుంచి మూడు నెలలపాటు పలు అంతర్జాతీయ సర్వీసులను తగ్గించనున్నట్లు సంస్థ వెల్లడించింది.
ఇందులో భాగంగా జూన్ నుంచి ఆగస్టు వరకు ఢిల్లీ – చికాగో, ముంబై – న్యూయార్క్, ఢిల్లీ – షాంఘై, చెన్నై – సింగపూర్, ముంబై – ఢాకా, ఢిల్లీ – మాలే అంతర్జాతీయ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎయిరిండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ ప్రకటించారు. పాకిస్థాన్ గగనతలం మూసివేసి ఉండటం వల్ల యూరప్, ఉత్తర అమెరికాకు వెళ్లే ఎయిరిండియా విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోందని చెప్పారు. దీనివల్ల ఇంధన వినియోగం, సిబ్బంది ఖర్చులు విపరీతంగా పెరిగి.. విమానాలపై నిర్వహణ ఖర్చును కూడా రాబట్టుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. ధరలు ఇదే విధంగా పెరిగితే మరిన్ని సర్వీసులపై కోత విధించాల్సి వస్తుందని వెల్లడించారు.
అయితే ప్రస్తుతానికి అంతర్జాతీయ సేవలను పూర్తిగా తగ్గించడం లేదని, ప్రతి నెలా 1,200కు పైగా అంతర్జాతీయ విమానాలను కొనసాగిస్తామని ఎయిరిండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ స్పష్టం చేశారు. ఉత్తర అమెరికాకు వారానికి 33 , యూరప్కు 47, యూకేకు 57 , ఆస్ట్రేలియాకు 8, ఫార్ ఈస్ట్, దక్షిణాసియా, సార్క్ దేశాలకు 158, మారిషస్కు 7 విమానాలు నడిపించనున్నట్లు వివరించారు.

