కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో రోజుకో కల్తీ వ్యవహారం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే అనేక కల్తీ రాకెట్లు వెలుగులోకి వచ్చాయి. ఆహారపదార్థాలు, పానియాలు, మాంసం ఇలా కల్తీకి కాదేది అనర్హం అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. తాజాగా వాటర్ ప్యాకెట్స్ (Adulterated Water Packets) కూడా కల్తీ చేస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. అంబర్పేట ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లపై టాస్క్ ఫోర్స్, ఫుడ్సేఫ్టీ అధికారులు తనిఖీ చేయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. కొన్ని ప్లాంట్లు పూర్తిగా అపరిశుభ్రమైన వాతావరణంలో నడుస్తున్నట్టు అధికారులు గుర్తించారు. తాగునీటిని శుద్ధి చేయాల్సిన చోటే చెత్త, మురికి పేరుకుపోయి ఉండడం, యంత్రాలు సరైన విధంగా నిర్వహించకపోవడం గమనార్హం. ముఖ్యంగా, ప్లాంట్ మొత్తం నీళ్లు లీక్ అవుతూ నేలంతా పాకూరుగా మారిపోయిన పరిస్థితి చూసి అధికారులు నివ్వరపోయారు.
నియమ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తూ, లైసెన్సులు లేకుండా కొన్ని యూనిట్లు కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు తేలింది. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ప్యాకెట్లలో నీటిని (Adulterated Water Packets) నింపి మార్కెట్లోకి పంపుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఈ చర్యలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు వాటర్ ప్లాంట్లను అధికారులు సీజ్ చేశారు. నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించినట్లు తెలిపారు. నివేదికలు వచ్చిన తర్వాత సంబంధిత యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజలు తాగునీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద బ్రాండ్ల నీటిని వినియోగించవద్దని అధికారులు హెచ్చరించారు. ప్యాకెట్ వాటర్ కొనుగోలు చేసే సమయంలో BIS మార్క్, తయారీ తేదీ, సంస్థ వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.
Read Also: నాకు రేవంత్రెడ్డితో చర్చకు దిగే ఉద్దేశం లేదు: కేరళ సీఎం
Follow Us On: Instagram

