కలం, కరీంనగర్ బ్యూరో: పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో సామాన్యులపై మోయలేని భారం పడుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) అన్నారు. వెంటనే ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న తనపై కొప్పుల ఈశ్వర్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
విద్యార్థులను పట్టించుకోని కొప్పుల..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సంక్షేమాన్ని మరిచిపోయి కేసీఆర్ ప్రజా భవన్, కేటీఆర్, హరీష్ రావు ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారని మంత్రి అడ్లూరి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ ఏనాడు విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేయలేదని మంత్రి అన్నారు. ఒక్క వసతి గృహం నిర్మించలేదన్నారు. ఎన్నికల హామీ ప్రకారం ధర్మారం మండలంలోని మిగులు భూములను పేద ప్రజలకు పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటికే బొమ్మరెడ్డిపల్లిలో 79 ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి విడిపించామన్నారు. నర్సింగాపూర్లో అనర్హుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు అందిస్తామని స్పష్టం చేశారు.

