కలం, మెదక్ బ్యూరో : యూరియా కోసం రైతులు భారీ క్యూ లైన్లు కట్టాల్సిన అవసరం లేదని ప్రస్తుతం మెదక్ జిల్లాలో సరిపడా స్టాక్ ఉందని కలెక్టర్ ప్రతీమా సింగ్ (Collector Pratima Singh) తెలిపారు. ప్రైవేట్ డీలర్స్, మార్క్ ఫెడ్ లో 6,300 మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టార్ట్ ఉందని, ప్రతి మండలంలో రెండు మూడు డీలర్ పాయింట్లు వద్ద యూరియా స్టాక్ అందుబాటులో ఉంచుతున్నామన్నారు. యూరియా యాప్ ద్వారా రైతులు ఇంటి వద్ద నుంచే యూరియాను బుక్ చేసుకుని సమయానికి అనుగుణంగా డీలర్స్ దగ్గరకు వెళ్లి అవసరానికి అనుగుణంగా యూరియా తీసుకోవచ్చని కలెక్టర్ ప్రతీమా సింగ్ రైతులకు సూచించారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉండేలా రైతు సేవా కేంద్రాలు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. రైతులకు ఎలాంటి నష్టాలు కలగకుండా నాణ్యమైన విత్తనాలు, ప్రమాణాలకు అనుగుణమైన ఎరువులు, పురుగుమందులను మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నకిలీ లేదా నాసిరకం ఉత్పత్తులకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా అమ్మినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.

