కలం, యాదగిరిగుట్ట : యాదాద్రి (Yadadri) జిల్లాలో గ్రామీణ అభివృద్ధి, ప్రజా సేవల అమలులో విశేష కృషి చేసిన జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి (DPO Vishnuvardhan Reddy) ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు (Bhaskar Rao) ప్రశంసించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా పంచాయతీ అధికారిగా విధులు నిర్వహించిన విష్ణువర్ధన్ రెడ్డికి పదోన్నతి లభించి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిగా సూర్యాపేటకు బదిలీ అయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజలకు పాలనను చేరువ చేయడంలో విష్ణువర్ధన్ రెడ్డి చూపిన నిబద్ధత అభినందనీయమని అన్నారు. జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్ సీఈవోగా పనిచేస్తూ అనేక రంగాల్లో విశేష సేవలు అందించారని కొనియాడారు. పంచాయతీ ఎన్నికలను ఎలాంటి లోపాలు లేకుండా సమన్వయంతో నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఎన్నికల్లో అధిక పోలింగ్ శాతం నమోదు కావడంలో ఆయన కృషి ఉందని పేర్కొన్నారు. ప్రతి ఫైలును వేగంగా పరిష్కరించేందుకు కృషి చేసిన అధికారిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది ఆయనతో పనిచేసిన అనుభవాలను పంచుకుంటూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో శోభారాణి, డిఆర్ఓ జయమ్మ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Also: కేబినెట్ విస్తరణ.. మంత్రి పదవి రేసులో ఆది శ్రీనివాస్!
Follow Us On: X(Twitter)

