కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మరో 62 అన్న క్యాంటీలను (Anna Canteens) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెండో విడత అన్న క్యాంటీన్లను ఈ నెల 15న సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజవర్గం ధరణికోటలో ప్రారంభించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 207 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయగా.. తాజా వాటితో కలిపి రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల సంఖ్య 269కు చేరనుంది.
అన్న క్యాంటీన్ల ద్వారా కేవలం రూ.5లకే ప్రభుత్వం రుచి, శుచితో కూడిన ఆరోగ్య ఆహారాన్ని అందిస్తోంది. పేదలకు రూ. 5లకే కడుపునిండా భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ అన్న క్యాంటీన్లను నిర్వహిస్తోంది. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్న క్యాంటీన్లను కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయగా.. 3 క్యాంటీన్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.ఇప్పటివరకు 207 అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకు 2.10 లక్షల మంది భోజనాలు చేస్తున్నారు. ఇందుకు గానూ రోజుకు రూ. 54 లక్షలపైగా వ్యయం అవుతోంది. ఇప్పుడు కొత్తగా 62 క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

