కలం, వెబ్ డెస్క్: మూసీ పునరుజ్జీవనం (Musi Revival)లో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) ప్రతినిధులు మంగళవారం హైడ్రా కార్యాయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath)తో సమావేశమై నగరంలో చెరువుల పునరుద్ధరణతో పాటు హైడ్రా కార్యకలాపాలపై చర్చించారు. గొలుసు కట్టు చెరువుల పునరుద్ధరణతో మూసీ నదికి కలిగే ప్రయోజనాలను చర్చించారు. హైడ్రా డెవలప్ చేసిన చెరువుల పూర్వ స్థితిని తెలుసుకున్నారు. హైడ్రా పునరుద్ధరించిన తర్వాత అంబర్పేటలోని బతుకమ్మకుంట, పాతబస్తీలోని బమృకున్ – ఉద్-దౌలా చెరువు, కూకట్పల్లిలోని నల్ల చెరువు రూపు రేఖలు మారిన తీరును వీడియోల ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా హైడ్రా కార్యకలాపాలను రంగనాథ్ పవర్ పాయింట్ ద్వారా ఏడీబీ ప్రతినిధులకు వివరించారు. హైడ్రా మొదటి విడత చేపట్టిన 6 చెరువుల పునరుద్ధరణతో పాటు.. రెండో విడత చేపట్టిన 14 చెరువుల గురించి క్షేత్ర స్థాయిలో చర్చించారు.
నగరంలో చాలా చెరువులు మూసీకి అనుసంధానంగా ఉన్నాయని.. ఈ చెరువుల పునరుద్ధరణతో మూసీ నదికి మంచి నీరు చేరేలా హైడ్రా చర్యలు తీసుకుంటోందని రంగనాథ్ తెలిపారు. హైడ్రా అభవృద్ధి చేసిన ప్రతి చెరువు వద్ద ఎస్టీపీ ఏర్పాటు చేసి మురుగునీటిని ఎక్కడికక్కడ శుభ్రం చేస్తే.. ఆ భారమంతా మూసీమీద పడకుండా జాగ్రత్త పడినట్టు అవుతుందని ఏడీబీ ప్రతినిధులకు సూచించారు. మూసీకి పై భాగంలో వచ్చే వరదను కట్టడి చేయడానికి ఉస్మాన్సాగర్ నిర్మాణంలో ఎలా ఉపయోగపడిందో నగరంలోని గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణతో వరద ముప్పును చాలా వరకు తగ్గించవచ్చనని.. ఆ దిశగా హైడ్రా పని చేస్తోందని చెప్పుకొచ్చారు.

