కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ (ACB) దూకుడు ప్రదర్శిస్తోంది. అధికారులే టార్గెట్గా దాడులు చేస్తుండటంతో అవినీతి అధికారుల్లో భయం నెలకొంది. తాజాగా కరీంనగర్ (Karimnagar) అర్బన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గుండేటి రామును మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లంచం వసూళ్లకు సహకరించిన ఓ టీచర్ సైతం అరెస్టు కావడం సంచలనం రేపింది. కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ గుండేటి రాము, జక్కని వేణులు గతంలో టీచర్లుగా కలిసి పనిచేశారు. ఆ తర్వాత రాము ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సాధించాడు. స్నేహాన్ని ఆసరాగా తీసుకున్న రాము, జక్కని వేణు అకౌంట్తో లంచాలు వసూలు చేయడం మొదలు పెట్టాడు. దీనికి వేణు కూడా ఒకే చెప్పాడు.
గుండేటి రాము గతంలో వేములవాడ ఎస్హెచ్వోగా పనిచేస్తున్నప్పడు బెల్లం వ్యాపారుల నుంచి లంచాలు తీసుకున్నాడు. ఆ లంచాలను జక్కని వేణు అకౌంట్లో వేయించుకునేవాడు. ఇలా 2019 నుంచి 2024 ఫిబ్రవరి వరకు నగదును బదిలీ చేయించుకున్నాడు. ఆ తరువాత గుండేటి రాము, తన తండ్రి అకౌంట్లకు బదిలీ చేయించుకునేవాడు. ఈ వ్యవహరంపై ఏసీబీకి ఫిర్యాదులు అందడంతో రాముతోపాటు టీచర్ వేణును అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు సోదాలు చేయగా లెక్కలోకి రాని రూ. 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు గుండేటి రామును, టీచర్ జక్కని వేణులను అరెస్టు చేసి కరీంనగర్ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

