కలం, వెబ్ డెస్క్: భారత సైన్యం ఆయుధాల సేకరణను మరింత వేగవంతం చేసింది. తక్షణమే రూ.20 వేల కోట్ల విలువైన డ్రోన్లకు (Drones) ఆర్డర్ పెట్టింది. ఈ మేరకు మిలటరీ డ్రోన్ ప్రొక్యూర్మెంట్ ప్రోగ్రాం చర్యలు చేపట్టింది. వీటిని పూర్తిగా మేకిన్ ఇండియా విధానంలోనే దేశంలోనే తయారు చేయాలని షరతు విధించింది. 18 నుంచి 24 నెలల వ్యవధిలో వీటిని సైన్యానికి అందించేలా ఒప్పందం కుదుర్చుకోనుంది. యుద్ధ రీతులు వేగంగా మారిపోతున్న వేళ, డ్రోన్లు అత్యంత కీలకంగా మారాయి. ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ పాకిస్థాన్ ఇలాంటి డ్రోన్లనే పంపించగా.. భారత్ విజయవంతంగా కూల్చేసింది. ఈ నేపథ్యంలోనే అధునాతన డ్రోన్లు సమకూర్చుకోవాలని సైన్యం భావిస్తోంది.
రఫేల్ యుద్ధ విమానాల కోసం డీల్..
భారత్కి 114 రఫేల్ యుద్ధ విమానాలు తక్షణమే కావాలని వైమానిక దళం సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్ దేశానికి చెందిన దసో ఏవీయేషన్ సంస్థతో త్వరలోనే భారీ ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ రూ.3 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి దీనిపై పూర్తి స్థాయిలో ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.

