జైస్వాల్‌పై సెలెక్టర్ల తీరు.. ప్రశ్నించిన ఆకాష్ చోప్రా

కలం, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత భారత జట్టు ఎంపికలపై కొత్త చర్చ మొదలైంది. యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) ను టీ20 జట్టులో ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా (Aakash Chopra) ప్రశ్నించారు. న్యూ చండీగఢ్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 223 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ ఆరు వికెట్ల తేడాతో, నాలుగు బంతులు మిగిలి ఉండగానే చేధించింది. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ 27 బంతుల్లో 51 పరుగులు చేసి జట్టుకు బలమైన ఆరంభం ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం తన యూట్యూబ్ వీడియోలో ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలుగా జైస్వాల్ ప్రదర్శన స్థిరంగా ఉన్నప్పటికీ అతన్ని పట్టించుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. టీ20 వరల్డ్ కప్ 2024 విజేత జట్టులో భాగమైన తర్వాత అతన్ని తప్పించారని గుర్తు చేశారు. ఎంపిక కాకపోవడం ఒక విషయం అయితే, చర్చల్లో కూడా లేకపోవడం ఆశ్చర్యకరమని ఆయన భావించారు. ఇటీవల జైస్వాల్ తన బ్యాటింగ్‌లో కొంత మార్పు చేసినట్లు చోప్రా తెలిపారు.

పవర్‌ప్లే తర్వాత కూడా నిలకడగా పరుగులు సాధించాలనే లక్ష్యంతో కొంచెం రక్షణాత్మకంగా ఆడుతున్నాడని చెప్పారు. ఇది పెద్ద స్కోర్ల దిశగా ముందడుగుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనపై కూడా చోప్రా ప్రశంసలు కురిపించారు. అతను మరింత పరిపక్వతతో ఆడుతున్నాడని పేర్కొన్నారు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌ను చక్కగా అంచనా వేసి తనకు అనుకూలంగా షాట్లు ఆడినట్లు వివరించారు. సూర్యవంశీ మొదట యార్కర్లను రక్షణాత్మకంగా ఎదుర్కొని, తర్వాత వచ్చిన బంతులను దాడి చేసి బౌలర్లపై ఒత్తిడి పెంచినట్లు చోప్రా చెప్పారు. అతని షాట్ ఎంపికలో మెరుగుదల కనిపించిందని అభిప్రాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ 16 బంతుల్లో 43 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. జైస్వాల్‌తో కలిసి కేవలం 3.2 ఓవర్లలోనే 51 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి జట్టుకు మంచి వేగాన్ని అందించాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>