కలం డెస్క్: స్క్వాష్ ప్రపంచ కప్ (SDAT Squash World Cup) విజేతగా భారత్ నిలిచింది. ఈ విజేత జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. చెన్నై వేదికగా జరిగిన మిక్స్డ్ టీమ్ స్క్వాష్ వరల్డ్ కప్–2025 టైటిల్ను గెలుచుకున్న తొలి ఆసియా జట్టుగా టీమ్ ఇండియా చరిత్ర సృష్టించడం గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్లో భారత స్క్వాష్ జట్టు అజేయంగా ముందుకుసాగుతూ ప్రపంచ కప్ను సొంతం చేసుకోవడం దేశ క్రీడా చరిత్రలో కీలక ఘట్టమని తెలిపారు. ఈ విజయం దేశవ్యాప్తంగా క్రీడాభిమానుల్లో కొత్త ఉత్సాహం, ప్రేరణను నింపిందని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అభిప్రాయపడ్డారు.
స్క్వాష్ ప్రపంచ కప్(Squash World Cup) టోర్నమెంట్లో అద్భుత ప్రతిభను ప్రదర్శించిన జోష్నా చినప్ప, అభయ్ సింగ్, అనాహత్ సింగ్, వేలవన్ సెంథిల్ కుమార్లను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికపై భారత జట్టు ప్రతిభను చాటుతూ దేశానికి గౌరవం తీసుకువచ్చినందుకు ఆటగాళ్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భారత స్క్వాష్ జట్టు సాధించిన ఈ చారిత్రాత్మక విజయం యువతకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచుతుందని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలకు బాటలు వేస్తుందని సీఎం ఆకాంక్షించారు. క్రీడాకారుల ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Read Also: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్.. షెఫాలీ, హార్మర్
Follow Us On: Instagram


