కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేత గువ్వల బాలరాజు (Guvvala Balaraju) లేఖ రాశారు. గురుకులాల మాజీ కార్యదర్శి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) పదవీ కాలంలో కోట్లాది రూపాయల ఆర్థిక అవకతవకలు, టెండర్ నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.
2013 నుంచి 2021 మధ్య కాలంలో భారీగా అక్రమాలు జరిగాయని లేఖలో పేర్కొన్నారు. అలాగే, ఐఐటీ/జేఈఈ కోచింగ్, సాఫ్ట్వేర్ శిక్షణ కార్యక్రమాలు, విద్యార్థుల యూనిఫాంల కొనుగోలు, ఎలక్ట్రికల్ సామగ్రి సేకరణ తదితర అంశాల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించడంతో పాటు, క్రిమినల్ దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని సీఎంను గువ్వల (Guvvala Balaraju) కోరారు.
విద్యార్థుల సంక్షేమం కోసం కేటాయించిన నిధుల వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని గువ్వల బాలరాజు తన లేఖలో పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలపై ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

