కలం, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సవరణ కమిషన్ (Central PRC) ఏర్పాటైంది. ఇందులో భాగంగా హైదరాబాద్, శ్రీనగర్, లడాఖ్ సమావేశాలు ఏర్పాటు చేసింది. తెలంగాణలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి సంఘాల నుంచి పే రివిజన్ కమిషన్ అభిప్రాయాలను రాతపూర్వకంగా తీసుకోవాలనుకుంటున్నది. అన్ని రాష్ట్రాల్లో పర్యటించి అభిప్రాయాలను తీసుకుంటున్నట్లుగానే ఈ నెల 18, 19 తేదీల్లో హైదరాబాద్కు పీఆర్సీ కమిషన్ వస్తోంది.
ఇందుకోసం కమిషన్తో భేటీ కావడానికి, వివరాలు ఇవ్వడానికి, డిమాండ్లపై క్లారిటీ ఇవ్వడానికి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవడం అవసరం ఉంటుంది అని కమిషన్ సూచించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందుకోసం ఆన్లైన్ ద్వారా ఈ నెల 8వ తేదీకల్లా సమాచారం ఇవ్వాలని, ఆ తర్వాత వచ్చే ఐడీ నెంబర్ను భద్రపర్చుకోవాలని డైరెక్టర్ వీఆర్ కృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులు ఈ కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేం కోరుకుంటున్నారో వాటిని రాతపూర్వకంగా సిద్ధం చేసి ఉంచుకోవాలని వెల్లడించారు. 18, 19 తేదీల్లో ఎక్కడ కలవాల్సి ఉంటుంది, టైమ్ను విడిగా ఉద్యోగుల మొబైల్ నెంబర్లకు సమాచారం వస్తుంది అని కమిషన్ పేర్కొంది. ప్రభుత్వ ఆర్గనైజేషన్స్, సంస్థలు, ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లతో సమావేశం అయి పే కమిషన్ కు సంబంధించిన అంశాలపై కమిషన్ సభ్యులు మాట్లాడనున్నారు.
Read Also: టార్గెట్ క్యూబా.. ట్రంప్ మరో సంచలన ప్రకటన

