కలం, వెబ్ డెస్క్: ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) నిర్మాతల పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుకు సంబంధించిన ఓ కార్యక్రమంలో దిల్ రాజు పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో నిర్మాతలకు కనీస విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు నిర్మాతలను గౌరవించే సంస్కృతి ఉండేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని దిల్ రాజు అభిప్రాయపడ్డారు.
సినిమా నిర్మాణంలో నిర్మాత (Producer) పాత్రను వివరిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘నిర్మాత అంటే ఇచ్చేవాడు, మిగతా వారంతా ఆయన దగ్గర తీసుకునేవాళ్లే. కానీ నేడు తీసుకునేవారే.. ఇచ్చే నిర్మాతలను శాసించే స్థాయికి చేరుకున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమలో అందరూ లాభాల కోసం చూస్తారని, కానీ సినిమా ఫెయిల్ అయితే వచ్చే నష్టాలను మాత్రం నిర్మాత ఒక్కడే భరించాల్సి వస్తోందన్నారు. ఈ క్రమంలో నిర్మాత గౌరవం క్రమంగా తగ్గుతూ వస్తోందని విమర్శించారు.
అట్లూరి పూర్ణచంద్రరావు వంటి నిర్మాతలు ఇండస్ట్రీకి ఎంతో స్ఫూర్తిదాయకమని దిల్ రాజు కొనియాడారు. ఇప్పటికైనా పరిశ్రమలో నిర్మాత హోదాను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, విలువలతో కూడిన సినిమాలను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని దిల్ రాజు అన్నారు.


