కలం, నిజామాబాద్ బ్యూరో : ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎనిమిది కోట్ల రూపాయల బకాయి ఆస్తి పన్ను కార్పొరేషన్కు చెల్లించిన.. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి శమంత రెడ్డిని (Shamanta Reddy) ఓడించాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) పిలుపునిచ్చారు. నిజామాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆమె మేయర్ అయితే నిజామాబాద్లో ఎవ్వరినీ చూడకుండా నిలువు దోపిడీ జరుగుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. వారు మేయర్ అయితే నిజామాబాద్ను శ్రీరాముడే కాపాడాలని వ్యాఖ్యానించారు. 17 ఏళ్ల బకాయిలు మేయర్ అభ్యర్థిత్వం ఖరారు కాగానే 17 గంటల్లో ఎనిమిది కోట్లు ఎలా కట్టారు.. లంకె బిందెలా, లాటరీనా మాకు కూడా ఆ రహస్యం చెప్పాలని ప్రశ్నించారు.
ఎనిమిది కోట్లు ఆస్తి పన్ను కట్టిన వారు నిజామాబాద్ మేయర్ (Nizamabad Mayor) కోసం ఎంత డీల్ మాట్లాడుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిపై ఎంపీ అర్వింద్ (Dharmapuri Arvind) ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థితో మున్సిపాలిటీకి ఎనిమిది కోట్ల ఆస్తి పన్ను కక్కించిన పార్టీ బీజేపీ అని చెప్పుకొచ్చారు. 17 ఏళ్లుగా ఆస్తిపన్ను కట్టకుండా బుకాయించిన వ్యక్తి ఈరోజు ఎన్నికల నామినేషన్ కోసం కట్టారని అలాంటి వారు మేయర్ అయితే ప్రజలను నిలువు దోపిడీ చేస్తారని విమర్శించారు. ఇలాంటి వారు మేయర్ అయితే నిజామాబాద్ పట్టణాన్ని దేవుడే కాపాడాలని అభిప్రాయ పడ్డారు. ప్రజలకు శఠగోపం పెట్టడమే వారి చరిత్ర అని విమర్శించారు. ఇలాంటి వాళ్ళని ప్రజలు బ్యాలెట్తో శిక్షించాలని పిలుపునిచ్చారు. కేవలం ఎన్ఓసి కోసం 8 కోట్లు ఖర్చు చేశారు. ఎన్నికల కోసం ఇంకో 10 కోట్లు ఖర్చు చేస్తారు.. ఇలాంటి వ్యక్తిని గెలిపిస్తే ఎంత అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇదే ప్రచార ఆస్త్రంతో ప్రజల్లోకి వెళ్తామని ప్రకటించారు.
Read Also: విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ పని: టీపీసీసీ చీఫ్
Follow Us On: Pinterest


