epaper
Thursday, January 29, 2026
spot_img
epaper

డంబెల్​తో మోది మహిళా కమాండో దారుణ హత్య

కలం, వెబ్​డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. భర్త ధన దాహానికి ఓ మహిళా కమాండో (SWAT Commando Murdered) బలైంది. మృతురాలు 4 నెలల గర్భిణి కావడం మరింత విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలోని సోనిపట్​కు చెందిన అంకుర్, కాజల్ (27) ​పెద్దలను ఒప్పించి 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఢిల్లీలోని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో అంకుర్​ క్లర్క్​గా పనిచేస్తున్నాడు. కాజల్​.. 2023లో ఢిల్లీ పోలీస్​ విభాగంలో ‘స్వాట్​’ కమాండోగా ఎంపికైంది. ​ఈ జంట 2024లో ఢిల్లీకి మకాం మార్చింది.

ఈ క్రమంలో ఈ నెల 22న రాత్రి పది గంటలకు దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో కాజల్​ తలను అనేక సార్లు డోర్​కేసి కొట్టడంతోపాటు డంబెల్​తో ఆమె తలపై మోదాడు అంకుర్​. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను సమీపంలోని గజియాబాద్​ హాస్పిటల్​లో చేర్పించాడు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. పోస్ట్​మార్టమ్​లో కాజల్​ తలకు బలమైన గాయాలున్నట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేయగా, అంకుర్​ ఇంట్లో డోర్​, డంబెల్​పై రక్తపు మరకలు కనిపించాయి. నిందితుడు కాజల్​ను డోర్​కేసి బాది, తలను డంబెల్​తో మోది చంపినట్లు గుర్తించారు. అనంతరం నిందితుని అదుపులోకి తీసుకున్నారు.

కాగా, పెళ్లైన 15 రోజుల నుంచే కారు, అదనపు కట్నం కోసం తమ కుమార్తెను అల్లుడు వేధించేవాడని కాజల్​ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాజల్​ను హాస్పిటల్​లో చేర్పించిన తర్వాత తమకు కాల్​ చేసి, మీ కూతురిని చంపేశానని (SWAT Commando Murdered) చెప్పినట్లు వాళ్లు విలపిస్తూ వెల్లడించారు. కాజల్​ ప్రస్తుతం గర్భిణి అని, తల్లీబిడ్డలను చంపిన అంకుర్​ను కఠినంగా శిక్షించాలని వాళ్లు డిమాండ్​ చేశారు.

Read Also: ప్రేమ‌ పెళ్లికి అడ్డొస్తున్నార‌ని త‌ల్లిదండ్రుల్ని చంపిన‌ కూతురు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>