కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో ముగ్గురు జర్నలిస్టుల అరెస్టును (Journalists Arrest) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు. పండుగ సమయంలో జర్నలిస్టులను అక్రమంగా నిర్బంధించడం అమానవీయమని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని విమర్శించారు.
జర్నలిస్టులను నేరస్థుల్లా చూడటం సరికాదని, విచారణకు పిలవాల్సి ఉంటే నోటీసులు ఇవ్వాలి తప్ప, అర్ధరాత్రి వేళ ఇళ్ల తలుపులు పగులగొట్టి భయభ్రాంతులకు గురిచేయడం పోలీసుల అతిప్రవర్తనకు నిదర్శనమని కేటీఆర్ ధ్వజమెత్తారు. బెయిలబుల్ సెక్షన్లు ఉన్నప్పటికీ ఇలాంటి చర్యలకు పాల్పడటం రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయాల్లో పోలీసులు భాగస్వాములు కావొద్దని ఆయన సూచించారు. ‘మొహబ్బత్ కీ దుకాన్’ అని చెప్పే రాహుల్ గాంధీ, తెలంగాణలో జరుగుతున్న ఈ అణిచివేతను గమనించాలని కోరారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు.
Read Also: పోలీస్ వాహనం పేల్చివేత.. ఏడుగురు దుర్మరణం
Follow Us On: Sharechat


