కలం వెబ్ డెస్క్ : గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం జిల్లాలను అశాస్త్రీయంగా విభజించిందని మంత్రి సీతక్క (Minister Seethakka) వ్యాఖ్యానించారు. బుధవారం ములుగు జిల్లాలో (Mulugu district) మంత్రి సీతక్క పర్యటించారు. ములుగు జిల్లా రద్దవుతోందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పాలనా సౌలభ్యాన్ని పట్టించుకోకుండా, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా అస్తవ్యస్తంగా జిల్లాల సరిహద్దులను నిర్ణయించారని విమర్శించారు.
ఒక మండలం మొత్తం ఒకే జిల్లాలో ఉండాలన్నది ప్రజల కోరిక అని సీతక్క తెలిపారు. ములుగు జిల్లాలో ఒక మండలం ఉంటుందని, అందులోని ఐదు గ్రామాలు పక్కన భూపాలపల్లి జిల్లాలో ఉన్నాయని చెప్పారు. అలాంటప్పుడు ప్రజలకు పాలనా ఫలాలు ఎలా అందుతాయని ప్రశ్నించారు. రెవెన్యూ, పోలీసు సరిహద్దులు ఒకేలాగా ఉండాలని చెప్పారు. కానీ ఆ విధానాన్ని కేసీఆర్ అవలంబించలేదని ఆరోపించారు. దీంతో జిల్లాల సరిహద్దు గ్రామాల ప్రజలు రెండు జిల్లాల కలెక్టరేట్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని తెలిపారు. అందుకే శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల సరిహద్దు విషయంలో స్వల్ప మార్పులు ఉంటాయని సీఎం చెప్పినట్లు తెలిపారు.
ములుగు జిల్లా ఏర్పాటు నచ్చని వాళ్లే ములుగు జిల్లా రద్దవుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ములుగు జిల్లా ప్రజలు నమ్మి ఆందోళన పడాల్సిన అవసరం లేదని సూచించారు. ములుగు జిల్లా అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. ములుగు జిల్లాను రద్దు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Read Also: ఆ చర్యలు అమానవీయం.. కేటీఆర్
Follow Us On : WhatsApp


