కలం, వెబ్ డెస్క్: అభివృద్ధిలో తెలంగాణ దేశానికే దిశా నిర్దేశం చేయబోతుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా దివిటిపల్లిలోని అమర రాజా గిగా కారిడార్లో అమర రాజా (Amara Raja) సెల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ను సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాంట్ను సందర్శించి సంస్థ కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. అమరరాజా గ్లోబల్ టాలెంట్ ఉన్న లోకల్ కంపెనీ అని ప్రశంసించారు. ఈ సంస్థ చైనాతో పోటీ పడి బ్యాటరీలు తయారు చేస్తోందని అభినందించారు.
1983లో అమరరాజా సంస్థను చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేశారని సీఎం చెప్పారు. కంపెనీలో 700 మంది ఉద్యోగుల్లో 400 మంది మహిళలే ఉన్నారని తెలిపారు. అలాంటి సంస్థను తెలంగాణలో తీసుకురావడం ఎంతో సంతోషమని చెప్పారు. మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ పాలసీలను కంటిన్యూ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వాటిని కొనసాగిస్తూనే మరింత మెరుగైన విధానాలను తీసుకొస్తున్నామని తెలిపారు. దేశంలో 2.5 శాతం జనాభా ఉన్న తెలంగాణ దేశానికి 5 శాతం జీడీపీని అందిస్తుందని అన్నారు. 2047 నాటికి దీన్ని 10 శాతానికి పెంచడమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

